నోరు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తరచూ తినాల్సినవి
ఫుడ్ ద్వారా సరిపోను క్యాలరీలు, లిపిడ్స్, ప్రొటీన్స్ అందుతున్నాయా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తారు కొందరు. కానీ, కొన్నిరకాల ఆహార పదార్థాల్లో ఉండే యాసిడ్స్ పళ్లని దెబ్బతీస్తాయి. అందుకే ఎలాంటి ఫుడ్ పళ్లకి హాని చేస్తుంది? ఎలాంటి ఫుడ్ హెల్దీగా ఉంచుతుంది? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డెంటిస్టులు.
టీ, కాఫీ లాంటి డ్రింక్స్, కొన్నిరకాల ఫుడ్స్లోని షుగర్ కారణంగా పళ్ల మీద ఉండే గారలోని బ్యాక్టీరియా యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ యాసిడ్స్ పంటి మీద ఎనామిల్ని దెబ్బతీస్తాయి. దాంతో పళ్ల మీద రంధ్రాలు ఏర్పడతాయి. ఈ సమస్య దూరమవ్వాలంటే..
బ్లాక్ టీ, గ్రీన్టీల్లో గారలోని బ్యాక్టీరియాని తొలగించే కెమికల్స్ ఉంటాయి. లీన్ ప్రొటీన్లోని ఫాస్పరస్ చికెన్, చేపలు, కండెన్స్డ్ సోయా పాలతో తయారుచేసిన టోఫు వంటివి తింటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ ఉండే బాదం పలుకులు తిన్నా కూడా పళ్లు పాడవ్వవు.
పౌడర్ రూపంలో ఉన్న జ్యూస్లు (షుగర్ ఎక్కువగా కలపనివి), డీ–హైడ్రేటెడ్ సూప్స్ వంటివి పళ్లని దెబ్బతీయవు.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. దాంతో పళ్లమధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలు పోయి, నోరు శుభ్రమవుతుంది.
పాలకూర, క్యాబేజీ జాతికి చెందిన ఆకుకూరలతో పాటు రకరకాల కూరగాయలు భోజనంలో ప్రతిరోజు ఉండాలి. ఫైబర్, విటమిన్–సి, విటమిన్–ఎ ఉన్న క్యారెట్లు పళ్లు, నోటిని హెల్దీగా ఉంచుతాయి. పంటి సమస్యలు ఉన్నవాళ్లు లడ్డూలు, చాక్లెట్ల బదులు యాపిల్ వంటి పండ్లు తినడం మంచిది.